సూర్యనారాయణ కుటుంబాన్ని ఆదుకుంటాం: సిఎం
హైదరాబాద్: ఆఫ్ఘనిస్ధాన్లో తాలిబాన్ల దురాగతానికి బలైన సూర్యనారాయణ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆదివారం మధ్యాహ్నం ప్రకటించారు. తాలిబాన్ల దురాగతాన్ని పిరికిపంద చర్యగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. సూర్యనారాయణ హత్యను ఇంకా ఆఫ్ఘన్ ప్రభుత్వం ధృవీకరించలేదని ఆయన అన్నారు. సూర్యనారాయణ ను తాలిబాన్ల చెర నుంచి విడిపించడానికి కేంద్ర ప్రభుత్వ బృందం కృషి చేసిందని, అయినా ఫలించలేదని ఆయన చెప్పారు. సూర్యనారాయణ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన నేటి ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్ను ఫోన్లో అభ్యర్ధించారు. సూర్యనారాయణ హత్య పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్ దిగ్భాంతిని వ్యక్తం చేసినట్టు ఆయన మీడియా సలహాదారు సంజయ్ బారు చెప్పారు. సూర్యనారాయణ కుటుంబసభ్యులను ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు పరామర్శిస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ వారిని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.