పర్యాటకులను హైజాక్ చేసిన మావోయిస్టులు
నల్గొండ: నాగార్జున సాగర్లో విహరిస్తున్న రెండు లాంచీలను మావోయిస్టులు ఆదివారం ఉదయం హైజాక్ చేశారు. ఈ రెండు లాంచీలలో 237 మంది విహార యాత్రికులు ఉన్నారు. సాగర్ నుంచి నాగార్జున కొండకు పర్యాటకులను తరలిస్తున్న లాంచీలు కొండ వద్దకు చేరగానే అవే లాంచీలలో ఉన్న మావోయిస్టులు పర్యాటకులను దించి వేసి లాంచీలను తమ అధీనంలోకి తీసుకున్నారు. తొమ్మిది మంది లాంచీల సిబ్బందిని నిర్బంధంలోకి తీసుకున్న మావోయిస్టులు పర్యాటకులతో మాత్రం మర్యాదగానే వ్యవహరించారు. కడప జిల్లా శేషాచలం కొండల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టులు ఈ చర్యకు దిగినట్టు తెలుస్తోంది. నాగార్జున కొండ నుంచి దాదాపు 200 మంది పర్యాటకులు తిరిగిరావడంతో అధికారులు ఊపిరి తీసుకున్నారు. లాంచీలను హైజాక్ చేసిన మావోయిస్టులు ఐదుగురని, వారిలో ఒక మహిళ ఉన్నారని అధికారులు గుర్తించారు. వీరి వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని ప్రయాణికులు చెప్పారు. సెల్ఫోన్ల ద్వారా పోలీసులకు సమాచారం అందజేస్తే కాల్చి చంపివేస్తామని మావోయిస్టులు బెదిరించినట్టు విడుదలైన ప్రయాణికులు తెలిపారు.