జడ్జి పౌరుడే కదా, ఏం చేయాలి?: డిజిపి
హైదరాబాద్: న్యాయమూర్తి నిబంధనలను ఉల్లంఘిస్తే తాము ఏం చేయాలని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ ప్రశ్నించారు. ఒక న్యాయమూర్తి సీట్ బెల్ట్ ధరించకపోవడంతో హైదరాబాద్లోని కాచిగుడా ట్రాఫిక్ పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ చలాన్ చేసి, దుర్భాషలాడారనే ఆరోపణపై న్యాయమూర్తి కస్సుబుస్సులాడడంపై ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల వద్ద ఆ విధంగా ప్రతిస్పందించారు. న్యాయమూర్తిని హెడ్ కానిస్టేబుల్ దుర్భాషలాడాడనే ఆరోపణపై విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు.
న్యాయమూర్తి కూడా పౌరుడే కదా, న్యాయమూర్తి నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం చేయాలని, చలాన్ రాయాలా, వద్దా? అని ఆయన అన్నారు. సి. నర్సింహారెడ్డి అనే హైకోర్టు న్యాయమూర్తి సీట్ బెల్ట్ ధరించకపోవడంతో హెడ్ కానిస్టేబుల్ జరిమానా విధిస్తూ చలాన్ రాశాడు. దాంతో ఆగ్రహించిన న్యాయమూర్తి తన సిబ్బందిని వెనక్కి పంపించి నిరసన వ్యక్తం చేశారు. పెద్ద మనుషులపై ఉల్టా సీదా మాట్లాడే ధైర్యం ఒక హెడ్ కానిస్టేబుల్కు ఉంటుందా అని కూడా ఆయన ప్రశ్నించారు. పోలీసులు తమ విధులు తాము నిర్వర్తించడం అవసరమని, తాను నిబంధనలు ఉల్లంఘిస్తే తనకు కూడా జరిమానా విధించే స్థాయికి పోలీసులు ఎదిగితే తనకు సంతోషమని ఆయన అన్నారు.