తెలంగాణ కెసిఆర్ మంత్రాంగం ముమ్మరం
హైదరాబాద్: తెలంగాణపై న్యూఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు మంత్రాంగాన్ని ఉధృతం చేశారు. ఆయన మంగళవారంనాడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సలహాదారు అహ్మద్ పటేల్ను కలిసి మంతనాలు జరిపారు. అయితే అహ్మద్ పటేల్ కెసిఆర్కు ఇచ్చిన హామీ ఏమిటనేది తెలియదు. ఆయనతో పాటు నరేంద్ర, రవీంద్ర నాయక్, వినోద్ కుమార్ అహ్మద్ పటేల్ను కలిసినవారిలో ఉన్నారు.
ఇదిలావుంటే, తెరాస నాయకులు తెలంగాణపై తమ అభిప్రాయాలు వెల్లడించడంపై తనకు ఏ విధమైన అభ్యంతరం లేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు మంగళవారం నిజామాబాద్లో అన్నారు. అయితే తెరాస నాయకుల భాష సున్నితంగా ఉండాలనేదే తన అభిమతమని ఆయన అన్నారు. కెసి ఆర్తో తాను భేటీ అయినప్పుడు సాధారణ విషయాలే మాట్లాడుకున్నామని ఆయన చెప్పారు. రాజకీయాల్లో భాషపై నియంత్రణ ఉండాలని తాను కోరుకుంటానని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బిల్లును ఈ నెల 10వ తేదీ నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపాదించాలని బిజెపి సీనియర్ నాయకుడు సిహెచ్. విద్యాసాగరరావు మంగళవారం హైదరాబాద్లో యుపిఎ ప్రభుత్వాన్ని కోరారు. సరైన సమయంలో, ఏకాభిప్రాయ సాధనతో తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటామని యుపిఎ అంటోందని, ఇందులోని సరైన సమయంలో, ఏకాభిప్రాయసాధనతో అనే పదాలను తొలగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాన ప్రతిపక్షం బిజెపి తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించినందున బిల్లు ప్రతిపాదనకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తాము పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు ప్రతిపాదించే అవకాశం లేదని ఆయన అన్నారు.
తెలంగాణ సాధన కోసం తలలు ఇవ్వాలి, అవసరమైతే తలలు తీయాలని తెరాస ఏర్పాటు చేసిన తెలంగాణ జాగరణ సేన అధిపతి ఉమాకాంత్ పిలుపునిచ్చారు. టిజెయస్ శిక్షణా శిబిరాన్ని ఆయన మంగళవారం మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో ప్రారంభించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు తమ మద్దతు అవసరమని, తెలంగాణపై స్పష్టమైన హామీ ఇస్తేనే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పని చేస్తామని ఆయన చెప్పారు. గత శాసనసభ ఎన్నికల్లో సోనియా, రాజశేఖర్ రెడ్డి గులాబీ కండువాలు వేసుకున్నారని ఆయన అన్నారు.