సూర్యనారాయణకు అంతిమ వీడ్కోలు
హైదరాబాద్: తాలిబన్ల చేతిలో మృతి చెందిన హైదరాబాద్కు చెందిన ఇంజనీర్ కాసుల సూర్యనారాయణ భౌతిక కాయానికి మంగళవారం ఉదయం అంత్యక్రియలు జరిగాయి. సూర్యనారాయణ ఎనిమిదేళ్ల కుమారుడు తేజ చితికి నిప్పంటించాడు. సూర్యనారాయణకు పలువురు కన్నీటి వీడ్కోలు పలికారు. మల్కాజిగిరిలోని పేటల్నగర్ స్మశాన వాటికలో సూర్యనారాయణ అంత్యక్రియలు జరిగాయి. సూర్యనారాయణ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
అంత్యక్రియలకు సూర్యనారాయణ ఇద్దరు కూతుళ్లు అనీషా, మనీషాతో పాటు ఇతర బంధువులు హాజరయ్యారు. ఆయన రెండో భార్య స్వప్న, ఆమె ఎనిమిది నెలల కూతురు నితీష కూడా సూర్యనారాయణ అంత్యక్రియలకు హాజరయ్యారు. మొదటి భార్య మంజుల మాత్రం కడసారి చూపుకు నోచుకోలేకపోయింది. అధికార లాంఛనాలతో సూర్యనారాయణ అంత్యక్రియలు జరిగాయి. సూర్యనారాయణ భౌతిక కాయాన్ని బయటకు తెచ్చిన వెంటనే రెండో భార్య స్వప్న రోడ్డుకు అడ్డంగా నిలబడి కడసారి చూపుకు వీలు కల్పించాలని డిమాండ్ చేసింది. ఆమె బలవంతంగా తప్పించి అంతిమ యాత్రను కొనసాగించారు. అత్మహత్యకు పాల్పడిన మంజుల ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి మెరగువుతోందని వైద్యులు చెప్పారు.