బిజెపి నేత ప్రమోద్ మహాజన్ కన్నుమూత
ముంబాయి: సోదరుడు ప్రవీణ్ మహాజన్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి హిందూజా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిజెపి సీనియర్ నేత ప్రమోద్ మహాజన్ బుధవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ప్రమోద్ మహాజన్ కన్ను మూసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. అంతకు ముందు బుధవారం ఉదయం పూట భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రమోద్ మహాజన్ ఆరోగ్య పరిస్థితి అత్యంత దారుణంగా విషమించింది. వైద్యానికి మహాజన్ శరీరం ఏ మాత్రం సహకరించడం లేదని హిందూజా ఆస్పత్రి వైద్యులు చెప్పారు. సోదరుడు ప్రవీణ్ మహాజన్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ మహాజన్ను గత నెల 22వ తేదీన హిందూజా ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. మహాజన్ ఊపిరితిత్తులు పని చేయడంలేదు. ఈ విషయంలో వైద్యులు చేతులెత్తేశారు. మహాజన్ను కాపాడడానికి అన్ని విధాలా కృషి చేశామని వైద్యులు అంటున్నారు.
ప్రమోద్ మహాజన్ అవయవాలు ఏవీ పని చేయడం లేదని వైద్యులు చెప్పారు. మహాజన్ కుటుంబ సభ్యులతో, మిత్రులతో ఐసియులో వైద్యులు మాట్లాడారు. తొలిసారి మహాజన్ కుటుంబ సభ్యులను ఐసియులోకి వైద్యులు అనుమతించారు. శ్వాస తీసుకోవడంలో మహాజన్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రి వద్దకు పెద్ద యెత్తున బిజెపి కార్యకర్తలు చేరుకుంటున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శివసేన అధినేత బాల్ థాకరే ఆస్పత్రికి వచ్చారు. బిజెపి సీనియర్ నేతలందరూ ముంబాయికి చేరుకుంటున్నారు.