ప్రమోద్ మహాజన్ పుట్టింది ఆంధ్రలోనే
హైదరాబాద్: అనూహ్య రీతిలో తమ్ముడి తూటాలకు బలైన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రమోద్ మహాజన్ పుట్టింది ఆంధ్రప్రదేశ్లోనే. ఆంధ్రప్రదేశ్తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రమోద్ మహాజన్ ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్నగర్ రైల్వే అతిథి గృహంలో జన్మించాడు. ప్రమోద్ తండ్రి వెంకటేష్ రైల్వే ఉద్యోగి. ప్రమోద్ జన్మించినప్పుడు వెంకటేష్ మహబూబ్నగర్లో పనిచేస్తున్నారు. ప్రమోద్కు ఆరు నెలల వయస్సు ఉన్నప్పుడు వెంకటేష్కు బదిలీ అయింది. బదిలీ మీద ఆయన మహారాష్ట్రకు వెళ్లారు. ప్రమోద్ మహాజన్ కూతురు పూర్ణిమ కూడా ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తినే ప్రేమించి వివాహం చేసుకుంది. ల్యాంకోకు చెందిన ఆనంద్తో పూర్ణిమ వివాహం హైదరాబాద్లోనే జరిగింది.
1993లో ప్రమోద్ మహాజన్ మహబూబ్నగర్కు వచ్చినప్పుడు ఎడ్ల బండిలో రైల్వే అతిథిగృహానికి వెళ్లి చూశారు. ప్రత్యేకంగా అడిగి ప్రమోద్ మహాజన్ అక్కడికి వెళ్లడం బిజెపి నేతలందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో నేను పుట్టిన గడ్డ మీద నిలబడి మాట్లాడడం నాకు గర్వంగా ఉంది అని చెప్పి తన జన్మించిన స్థలం గురించి ఆయన చెప్పారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనను మరింతగా అభిమానించడం మొదలు పెట్టారు. పాలమూరు జిల్లా నుంచి ఢిల్లీకి వెళ్లిన ఎవరినైనా ఆయన ఆదరంగా చూసేవారు. ప్రమోద్ మహాజన్ ఆంధ్రప్రదేశ్కు తుదిసారి వచ్చింది నిరుడు నవంబర్ 20వ తేదీన. ఆయన నిరుడు నవంబర్ 20వ తేదీన విజయవాడకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో బిజెపి స్నేహం కట్టే విషయంలో ప్రధాన పాత్ర పోషించింది కూడా ప్రమోద్ మహాజనే. చంద్రబాబు హైటెక్ విధానాలకు మహాజన్ నుంచి మంచి ప్రోత్సాహం ఉండేది. ప్రమోద్ మహాజన్ మృతి పట్ల చంద్రబాబునాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.