రేపు ముంబాయిలో ప్రమోద్ అంత్యక్రియలు
ముంబాయి: భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రమోద్ మహాజన్ భౌతిక కాయానికి రేపు (గురువారం) ముంబాయిలోని శివాజీ పార్కులో అంత్యక్రియలు జరుగుతాయి. పార్టీ కార్యకర్తల, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని పార్టీ కార్యాలయానికి తరలించారు. 56 యేళ్ల ప్రమోద్ మహాజన్ పార్టీలో చురుకైన పాత్ర నిర్వహిస్తూ పార్టీలో ఆధునిక భావాలను ప్రవేశపెట్టిన నేతగా పేరు పొందారు. ప్రమోద్ మహాజన్ తన తండ్రి వెంకటేష్ మహాజన్కు పెద్ద కొడుకు. ఆయనపై కాల్పులు జరిపిన ప్రవీణ్ చిన్న తమ్ముడు. మరో తమ్ముడు ప్రకాశ్ మహాజన్ ఔరంగాబాద్లో స్థిరపడ్డారు. ఆయనకు ఇద్దరు చెల్లెలు. ప్రమోద్కు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. ప్రమోద్ మహాజన్ తన 29వ యేట రాజకీయాల్లో ప్రవేశించారు. అప్పటి నుంచి ఆయన వెనకడుగు వేసింది లేదు. కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగిన దిట్ట.
ప్రమోద్ మహాజన్ 1949 అక్టోబర్ 30వ తేదీన జన్మించారు. ప్రమోద్ మహాజన్ విద్యాభ్యాసం మహారాష్ట్రలోని బీడ్, ఔరంగాబాద్లలో జరిగింది. ఆయన జర్నలిజం, భౌతిక శాస్త్రాల్లో డిగ్రీ పట్టా పొందారు. రాజకీయ శాస్త్రంలో పిజి చేశారు. ఆయన జనసంఘ్, జనతాపార్టీల్లో పని చేశారు. 1983లో ఆయన బిజెపి జాతీయ కార్యదర్శిగా పని చేశారు. తొలిసారి 1986లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మూడు సార్లు ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో ఈశాన్య ముంబాయి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. వాజ్పేయి ప్రభుత్వంలో ఆయన రక్షణ, టెలీకమ్యూనికేషన్ల మంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పని చేశారు.
ప్రమోద్ మహాజన్ 12 రోజుల పాటు హిందూజా ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడి చివరకు బుధవారం మధ్యాహ్నం మరణించారు. ఆయన సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే ఆయన అంతకు ముందే కన్ను మూపినప్పటికీ బిజెపి నేతలందరూ వచ్చిన తర్వాతనే ఆయన మరణించినట్లు ప్రకటించారు. ప్రమోద్ మహాజన్ మరణవార్త విన్న వెంటనే బిజెపి నేతలు అద్వానీ, రాజ్నాథ్ సింగ్ తమ యాత్రలను రద్దు చేసుకుని ముంబాయి చేరుకున్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రమోద్ మహాజన్ మృతికి కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు సంతాపం వ్యక్తం చేశాయి. బిజెపిలో మహాజన్ సమర్థుడైన నాయకుడని కాంగ్రెస్ అభివర్ణించింది. మహాజన్ మృతికి ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు.