దిగ్విజయ్తో మర్రి, పిజెఆర్, కెకె భేటీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్తో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు భేటీ అయ్యారు. హైదరాబాద్ నగర పార్టీ శాసనసభ్యులు మర్రి శశిధర్ రెడ్డి, పి. జనార్దన్ రెడ్డిలకు జారీ చేసిన షోకాజ్ నోటీసులపై వారిరువురి మధ్య చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేశారనే ఆరోపణపై వారికి కాంగ్రెస్ అధిష్ఠానవర్గం నోటీసులు జారీ చేసింది. వారు చేస్తున్న విమర్శలను, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఒక వివరమైన పత్రాన్ని కేశవరావు దిగ్విజయ్ సింగ్కు సమర్పించారు.
కేశవరావుతో సమావేశం ముగిసిన తర్వాత దిగ్విజయ్ సింగ్ శాసనసభ్యులు మర్రి శశిధర్ రెడ్డి, పి. జనార్దన్ రెడ్డిలతో సమావేశమయ్యారు. తాము చేసిన ప్రకటనలకు, తదితర వివరాలకు సంబంధించిన పత్రికా క్లిప్పింగ్లను, తదితరాలను వారు దిగ్విజయ్ సింగ్కు సమర్పించేందుకు వారు సమాయత్తమై వచ్చారు. శివారు ప్రాంతాలను కలిపి హైదరాబాద్ను గ్రేటర్ హైదరాబాద్గా చేయాలనే రాజశేఖర్ రెడ్డి ప్రతిపాదనను వారు వ్యతిరేకిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్పై తమ వాదనను దిగ్విజయ్ సింగ్కు వివరించామని సమావేశానంతరం ఆ ఇరువురు శాసనసభ్యులు మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ రోజు తమకు చాలా సంతోషంగా ఉందని, తాము లేవనెత్తుతున్న అంశాలపై అధిష్ఠానానికి వివరంగా సమాధానం చెప్పే అవకాశం లభించిందని వారన్నారు. అన్ని విషయాలను దిగ్విజయ్ సింగ్కు వివరించామని వారు చెప్పారు. అయితే తాము ఏ విషయాలను వివరించిందీ, ఏ అంశాలు చర్చకు వచ్చిందీ వారు చెప్పారు. పోతిరెడ్డి పాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడాన్ని పి. జనార్దన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గోదావరి జలాల వినియోగంపై వారిద్దరు దిగ్విజయ్ సింగ్కు వివరించినట్లు సమాచారం.