ప్రమోద్ మహాజన్కు కన్నీటి వీడ్కోలు
ముంబాయి: సోదరుడు ప్రవీణ్ కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతూ హిందూజా ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన బిజెపి సీనియర్ నేత ప్రమోద్ మహాజన్ భౌతికకాయానికి గురువారం ముంబాయిలోని శివాజీ పార్కులో అంత్యక్రియలు జరిగాయి. ప్రమోద్ మహాజన్ కుమారుడు రాహుల్ చితికి నిప్పంటించారు. ప్రమోద్ మహాజన్ అంత్యక్రియలకు పలువురు వివిఐపిలు హాజరయ్యారు.
ఉపరాష్ట్రపతి బైరాన్సింగ్ షెకావత్తో పాటు మాజీ ప్రధాని వాజ్పేయి, రథయాత్రలను అర్థాంతరంగా ఆపేసిన బిజెపి సీనియర్ నేతలు ఎల్.కె. అద్వానీ, రాజ్నాథ్ సింగ్లు అంత్యక్రియలకు హాజరై ప్రమోద్ మహాజన్కు నివాళులు అర్పించారు. పెద్ద యెత్తున బిజెపి కార్యకర్తలు తమ ప్రియతమ నాయకుడి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ అంత్యక్రియలకు ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఎవరూ పాల్గొనలేదు. ఆర్యస్యస్ ఛీఫ్ సుదర్శన్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, రాజ్థాకరే కుటుంబ సభ్యులు, అనిల్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు, సినీ నటి హేమమాలిని ప్రమోద్ మహాజన్కు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. ప్రమోద్ మహాజన్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.