తెలంగాణపై బిజెపి కీలక సమావేశం రేపు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై రేపు సోమవారం భారతీయ జనతాపార్టీ కీలక సమావేశం జరిగే అవకాశముంది. బిజెపి అగ్రనాయకులు రేపు వాజ్పేయి నివాసంలో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇస్తామని బిజెపి అధ్యక్షుడు రాజ్నాధ్ సింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా బిజెపి పావులు కదపడంతో కాంగ్రెస్ అధిష్టానవర్గంలో చలనం మొదలైంది. మేనెలలో తెలంగాణకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన వెలువడుతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని టిఆర్ఎస్ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చంద్రశేఖరరావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రం విషయంలో ప్రణబ్ ముఖర్జీ నివేదిక అందిన తర్వాతే కాంగ్రెస్ అధిష్టానవర్గం ఒక నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ నిన్న స్పష్టం చేశారు.