వైయస్ తప్పుకుంటారా?: చంద్రబాబు ప్రశ్న
కడప: వచ్చే పంచాయతీ ఎన్నికల్లో తమకు 90 శాతం సీట్లు వస్తే ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సవాల్ చేశారు. డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి ప్రజాసమస్యలు పట్టడం లేదని, ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రజాపథం కార్యక్రమంలో ప్రజాసమస్యలపై దృష్టి పెట్టకుండా తమను విమర్శించడమే ముఖ్యమంత్రి పనిగా పెట్టుకున్నారని ఆయన అన్నారు.
రాజశేఖర్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని, తాము ప్రశ్నలడిగితే ఎదురుదాడికి దిగుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు అందరికీ న్యాయం చేయాలనే వివేకాన్ని ప్రదర్శించడం లేదని ఆయన విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి, ఆయన చుట్టూ ఉండేవారు వారి స్వార్థమే చూసుకుంటున్నారని ఆయన అన్నారు. రాజశేఖర్ రెడ్డిలా దౌర్జన్యం, రౌడీయిజం చేసేవారికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండదని ఆయన అన్నారు. పోలీసులతో పంచాయతీ ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ వారు అనుకుంటున్నారని, వారి ఆటలు సాగనివ్వమని ఆయన అన్నారు.