తెలంగాణపై ఇక తుది నిర్ణయం తెరాసదే: బిజెపి
న్యూఢిల్లీ: తెలంగాణపై ఇక తుది నిర్ణయం తీసుకోవాల్సింది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)యే అని భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంటరీ పార్టీ స్పష్టం చేసింది. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంటు బిల్లు ప్రతిపాదించకపోతే యుపిఎ నుంచి తెరాస బయటకు రావాలని సమావేశానంతరం ప్రతిపక్ష నాయకుడు, బిజెపి సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ తెరాసకు సూచించారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే బలపరచాలని పార్లమెంటరీ సమావేశం నిర్ణయం తీసుకుంది. బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం రెండు గంటల పాటు జరిగింది. ఇదిలా వుంటే, తెలంగాణపై ఏర్పాటయిన యుపిఎ ఉపసంఘం సభ్యుడు రఘువంశ ప్రసాద్ తెరాస అధినేత కె. చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ఉపసంఘం చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ ప్రకటన నేపథ్యంలో ఆయన కెసిఆర్తో సమావేశమైనట్లు సమాచారం.
రాష్ట్రంలో తెరాసకు సంబంధించి మరో ముఖ్య పరిణామం చోటు చేసుకుంది. తెరాస అసమ్మతి శాసనసభ్యులు గీట్ల ముకుందరెడ్డి, బండారు శారారాణి, దుగ్యాల శ్రీనివాసరావు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు కె. కేశవరావును కలుసుకున్నారు. తమ పార్టీ సిద్ధాంతాలతో ఏకీభవిస్తే తెరాస అసమ్మతి శాసనసభ్యులను తమ పార్టీలో చేర్చుకోవడానికి అభ్యంతరమేమీ లేదని కేశవరావు అన్నారు. తమ పార్టీ అసమ్మతి శాసనసభ్యులు కాంగ్రెస్లో కలిస్తే తమకేమీ నష్టం లేదని తెరాస అధికార ప్రతినిధి రత్నం అన్నారు. వారిని తెలంగాణ ద్రోహులుగా ప్రజలు ఇప్పటికే గుర్తించారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయినందుననే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.