తిరుమల పవిత్రతను కాపాడాలి: చంద్రబాబు
తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయం పవిత్రను కాపాడాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుమలను పూర్తి స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దాలని, ఇతర మతాల ప్రచారాలను అనుమతించకూడదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆయన తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రికమండేషన్లతో తిరుమలలో దర్శనాలను అనుతించకూడదని ఆయన అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా సామాన్య భక్తుడిలాగనే దర్శనం చేసుకన్నానని ఆయన గుర్తు చేశారు.
చోటామోటా కాంగ్రెస్ నాయకుల రికమండేషన్లకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన విమర్శించారు. తిరుమలను ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పూర్తి స్థాయి వ్యాపార కేంద్రంగా మారుస్తోందని ఆయన విమర్శించారు. తిరుమలలో ఎవరికి పడితే వారికి గెస్ట్ హౌస్ల నిర్మాణానికి అనుమతిస్తూ కార్పోరేట్ సంస్థగా మార్చివేస్తుండడాన్ని ఆయన వ్యతిరేకించారు. టిటిడి పాలకమండలి చైర్మన్కు గెస్ట్హౌస్ ఎందుకని ఆయన ప్రశ్నించారు. తాను 9 యేళ్లు అధికారంలో ఉన్న సమయంలో కావాలంటే గెస్ట్హౌస్ను కట్టులేకపోయానా అని ఆయన అడిగారు. దేవుని స్థలంలో బయటివారికి ఆస్తులెందుకని, తిరుమల ఆస్తులు కాపాడితే చాలునని ఆయన అన్నారు.