పంచాయతీ ఎన్నికల్లో తెరాసతో పొత్తు: వైయస్
కర్నూలు: వచ్చే పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కాంగ్రెస్ పొత్తు కొనసాగుతుందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. కర్నూలు జిల్లాలో మంగళవారం ఏర్పాటయిన ప్రజాపథం బహిరంగ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో తమకు పది శాతం సీట్లే వస్తాయని తెలుగుదేశం పార్టీ నాయకులు అంగీకరించడం సంతోషకరమని ఆయన అన్నారు.
నీటిపారుదల రంగానికి మినహా ఇతర రంగానికి నిధులు ఇవ్వలేమని ఆయన చెప్పారు. రహదారుల నిర్మాణానికి నిధులు ఏవీ లేవని ఆయన స్పష్టం చేశారు. కెసి కాలువ ఆధునీకరణ పనుల్లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు. గృహ నిర్మాణ పథకం కింద నిర్మించే ఇళ్లకు సరఫరా చేసే సిమెంటు ధరను 25 నుంచి 30 శాతం తగ్గంచేలా చూస్తామని ఆయన చెప్పారు. ఎత్తిపోతల పథకం మంత్రి మారెప్ప మాత్రం ఇదే సభలో తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రనేతలు కె. చంద్రశేఖరరావు, నరేంద్రలపై తీవ్రంగా ధ్వజమెత్తారు.