తెలంగాణపై అధికార ప్రకటన రేపోమాపో: కెసిఆర్
న్యూఢిల్లీ: రానున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రతిపాదించే అవకాశాలు లేవని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్ రావు చెప్పారు. ఆయన మంగళవారం సాయంత్రం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను కలిసి తెలంగాణపై చర్చించారు. ప్రధానితో తెరాస బృందం అరగంట సేపు మాట్లాడింది. కెసిఆర్తో పాటు కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర, తెరాస సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితరులు ప్రధానిని కలిసినవారిలో ఉన్నారు.
తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీ కమిటి నివేదికను సాధ్యమైనంత త్వరలో సమర్పించేలా చూడాలని కెసిఆర్ ప్రధానిని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వేగిరపరచాలని తాము ప్రధానిని కోరినట్లు ఆయన తెలిపారు. వచ్చే మూడు నాలుగు రోజుల్లో ప్రణబ్ ముఖర్జీ కమిటీ సమావేశమై తన నివేదికను సమర్పించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదిక అందగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అధికారిక ప్రక్రియను ప్రారంభిద్దామని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ప్రకటన చేసే విధానాన్ని ఖరారు చేయడానికి ఢిల్లీలో తనను అందుబాటులో ఉండాలని ప్రణబ్ ముఖర్జీ సూచించారని ఆయన చెప్పారు.