ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తాం: వైయస్
మహబూబ్నగర్/ మెదక్: విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. అందుకు అవసరమైన కోర్టు కేసులను అధిగమిస్తామని ఆయన చెప్పారు. మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో ఆయన మంగళవారం ప్రజాపథం కార్యక్రమం నిర్వహించారు. మెదక్ జిల్లా కొడకండ్లలో బయోటెక్ పార్కుకు, 400 కెవి సబ్ స్టేషన్కు ఆయన శ్రీకారం చుట్టారు. మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలను 10 కోట్ల రూపాయల నుంచి 33 కోట్ల రూపాయలకు పెంచినట్లు ఆయన తెలిపారు.
12 జిల్లాల్లో మైనారిటీలకు కొత్తగా హాస్టల్స్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్ గోదావరి, కృష్ణా నదీ జలాలు అందించి మంజీర జలాన్ని పూర్తిగా నిజామాబాద్, మెదక్ జిల్లాలకే అందిస్తామని ఆయన చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా బిజినేపల్లిలో ప్రజాపథం కార్యక్రమంలో తెలుగుదేశం శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. నాగం జనార్దన్ రెడ్డి ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.