ఇది లౌకిక పార్టీల విజయం: మన్మోహన్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో లౌకిక పార్టీలు విజయం సాధించాయని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. రాయబరేలీ లోక్సభ సీటులో ఘన విజయం సాధించిన సోనియా గాంధీకి ఆయన అభినందనలు తెలియజేశారు. డియంకె నేత కరుణానిధికి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యకు ఆయన ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. అస్సాంలో కాంగ్రెస్ విజయం సాధించినందుకు తరుణ్ గోగోయ్కి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. అస్సాం, పాండిచ్చేరి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఐదు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో యుపిఎ భాగస్వామ్య పక్షాలు విజయం సాధించాయని సిపియం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అన్నారు. ఈ ఫలితాలు రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. వామపక్షాల విధానాలకు మద్దతు లభిస్తోందనడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలపై బిజెపి వ్యాఖ్యానించే స్థితిలో కూడా లేదు.