వామపక్షాల్లో ఉత్సాహం: కాంగ్రెస్కు ఊరట
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో యుపిఎ భాగస్వామ్య పక్షాలు ఘన విజయం సాధించాయి. భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఊసు కూడా ఈ ఎన్నికల్లో వినిపించలేదు. పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో విజయం సాధించాయి. తమిళనాడులో కరుణానిధి నేతృత్వంలోని డియంకె, దాని మిత్రపక్షాలు విజయం సాధించాయి. తమిళనాడులో మొదటిసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోంది. కేరళలో ఎల్డియఫ్ కూటమి కాంగ్రెస్ నాయకత్వంలోని యుడియఫ్ కూటమిపై విజయం సాధించింది. యల్డియఫ్కు 98 స్థానాలు దక్కగా, యుడియఫ్కు 41 స్థానాలు దక్కాయి. కరుణాకరన్ పార్టీ తీవ్రంగా దెబ్బ తిన్నది. ఈ ఎన్నికలు వామపక్షాల్లో ఉత్సాహాన్ని నింపగా, కాంగ్రెస్కు కాస్తా ఊరటనిచ్చాయి.
అస్సాంలో చిన్నచితకా పార్టీలది, ఇండిపెండెంట్లది పైచేయిగా ఉంది. ఎక్కువ స్థానాలను మాత్రం కాంగ్రెస్ దక్కించుకుని కాస్తా పరువు కాపాడుకుంది. కాంగ్రెస్కు 51 స్థానాలు రాగా, అస్సాం గణ పరిషత్ 29 సీట్లతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. ఇతరులు 45 మంది గెలిచారు. దీంతో చిన్నచితకా పార్టీలతో, ఇండిపెండెంట్లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బిజెపి ఐదు స్థానాలను మాత్రమే దక్కించుకుంది. పాండిచ్చేరిలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్కు 20 సీట్లు దక్కగా అన్నాడియంకెకు 7 సీట్లు వచ్చాయి. ఇతరులు ముగ్గురు గెలిచారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ప్రణబ్ ముఖర్జీ రాజీనామా చేశారు.