జయకు చుక్కెదురు: ఓటర్ల కరుణానిధి
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయలలితకు చుక్కెదురైంది. జయలలిత నేతృత్వంలోని అన్నాడియంకె ఘోరం ఓడిపోయింది. దీంతో జయలలిత కన్న కలలు వమ్మయ్యాయి. అన్నాడియంకె కేవలం 71 సీట్లను మాత్రమే గెలుచుకుంది. సినీనటుడు విజయకాంత్ పార్టీ డియంకెను దెబ్బ తీస్తుందని భావించారు. అయితే అన్నాడియంకె ఓట్లే చీల్చినట్లు తెలుస్తోంది. కరుణానిధి నాయకత్వంలోని డియంకె 161 సీట్లు గెలుచుకుంది. వైగో నేతృత్వంలోని యండియంకె పొత్తు అన్నాడియంకెను గట్టెక్కించలేకపోయింది. పైగా యండియంకె ఘోరంగా దెబ్బ తిన్నది.
ముఖ్యమంత్రి జయలలిత తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపారు. ఆండిపట్టి నియోజకవర్గం నుంచి ఆమె శాసనసభకు ఎన్నికయ్యారు. చేపాక్ నుంచి డియంకె నేత కరుణానిధి భారీ మెజారిటీతో విజయం సాధించారు. కరుణానిధి కుమారుడు స్టాలిన్ కూడా శాసనసభకు గెలిచారు. కరుణానిధి మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు. కొత్త పార్టీ పెట్టి ఎన్నికల రణరంగంలోకి దిగిన విజయకాంత్కు నిరాశే మిగిలింది. ఆయన తప్ప మరెవరూ విజయం సాధించలేకపోయారు.ఈ ఫలితాలతో అన్నాడియంకె నేత, ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ బోసిపోయింది. కరుణానిధి ఇంటి వద్ద, డియంకె కార్యాలయం వద్ద కార్యకర్తలు, అభిమానుల ఉత్సాహంతో పండుగ వాతావరణం నెలకొంది. అయితే తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీ డియంకెకు దక్కలేదు. దీంతో తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఏర్పాటుపై తమ భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తామని కరుణానిధి మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వం ఏర్పాటుకు వ్యూహాన్ని ఖరారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. డియంకెకు తమ మద్దతు ఉంటుందని సిపియం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ చెప్పారు. పేదలకు డియంకె ఇచ్చిన హామీలు డియంకెకు పట్టం కట్టాయి. కరుణానిధి అరెస్టు వంటి కక్ష సాధింపు చర్యలు కూడా జయలలిత ఓటమికి కారణమయ్యాయి. కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిపై కోర్టు కేసుల వంటివి కూడా పని చేసి వుంటాయని భావిస్తున్నారు.