కాంగ్రెస్ వేడుకలు ఎవరి కోసం?: బాబు
హైదరాబాద్: ప్రజలు కష్టాల్లో కూరుకుపోయి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వేడుకలు జరుపుకుంటోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ విజయోత్సవ సభలు ఎవరి కోసమని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ పునరంకిత సభను ఉద్దేశించి ఆయన అన్నారు. ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ప్రథమ వార్షికోత్సవ సభలో ఆయన ఆదివారంనాడు ప్రసంగించారు. విద్యుత్ కోత వల్ల, కనీస మద్దతు ధరలు లేకపోవడం వల్ల, ధరల పెరుగుదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ నాయకులు విజయోత్సవ సభలు నిర్వహించుకుంటున్నారని ఆయన అన్నారు. పార్టీ కోసం పనిచేసేవారి కుటుంబాల బాధ్యతను తామే చూసుకుంటామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ హత్యలు, కక్ష సాధింపులు పెరిగాయని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. రైతులకు ఒక వైపు గిట్టుబాటు ధరలు లభించడం లేదని మరోవైపు దళారీలు వారిని లూటీ చేస్తున్నారని ఆయన అన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. వైయస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన అన్నారు.