వర్గీకరణకు కేంద్రంపై ఒత్తిడి: ముఖ్యమంత్రి
హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, తాము ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పునరంకిత సభలో ఆయన ఆదివారం ఈ ప్రకటన చేశారు. ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నందున ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణకు చర్యలు తీసుకోవాలని తాము కేంద్రప్రభుత్వాన్ని కోరామని ఆయన చెప్పారు. ఒక కమీషన్ వేసి, కూలంకషంగా చర్చించి ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టం తేవాలని, అందుకు త్వరితమే చర్యలు చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. తాము చేపట్టిన కార్యక్రమాలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. తనను తెలుగుదేశం పార్టీ నాయకులు ఫాక్షనిస్టు అనడాన్ని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. తానే ఫాక్షనిస్టు అయితే తన తండ్రిని చంపినవారు స్వేచ్ఛగా తిరగగలిగి ఉండేవారా అని ఆయన అడిగారు. పరిటాల రవి హత్య కేసును డిమాండ్ చేసిన వెంటనే సిబిఐకి అప్పగించామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన అభియోగాల పత్రం నిరర్థకమని ఆయన అన్నారు. రాష్ట్రంలో 1983 తర్వాతే రిగ్గింగ్ ప్రారంభమైందని ఆయన విమర్శించారు. గోబెల్స్ ప్రచారంతో ప్రాంతీయ తెలుగుదేశం పార్టీ మనుగడ సాగించే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.