వైయస్ పాలన ఉద్దరించిందేమీ లేదు: సిపియం
విజయవాడ: అన్ని ఎన్నికల వాగ్దానాలను విస్మరించి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకేదో చేశామని చెప్పుకోవడం విడ్డూరమని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ నిర్వహించాల్సింది పునరంకిత సభ కాదని, పునరాలోచన సభ నిర్వహించాలని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో వ్యంగ్యంగా అన్నారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి రెండేళ్ల పాలన నిరాశనే మిగిల్చిందని ఆయన అన్నారు. ప్రపంచ బ్యాంకు షరతులకు లొంగరాదని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం సమగ్ర జలవిధానాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. దళితుల్లో చైతన్యం తెచ్చేందుకు, సామాజిక అసమానతలను తొలగించేందుకు ప్రభుత్వం చైతన్య యాత్రలు నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఉచిత విద్యుత్పై వైయస్ ప్రభుత్వం వెనక్కి మళ్లే సూచనలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు.