గాంధీ కలలను నిజం చేస్తున్న వైయస్: మణిశంకర్
హైదరాబాద్: మహాత్మాగాంధీ కలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సాకారం చేస్తున్నారని కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ ప్రశంసించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఏర్పాటయిన పునరంకిత సభలో వక్తలు ముఖ్యమంత్రిని ప్రశంసలతో ముంచెత్తారు. పునరంకిత సభకు మణిశంకర్ అయ్యర్తో పాటు కాంగ్రెస్ జాతీయ నాయకులు పలువురు హాజరయ్యారు. పంచాయతీరాజ్ వ్యవస్థ విషయంలో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువబోతోందని మణిశంకర్ అయ్యర్ అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 5 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
గ్రామాలను విస్మరించడం వల్లనే జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్డిఎ) ఓడిపోయిందని ఆయన అన్నారు. భారత్ వెలిగిపోతోంది అనే బిజెపి నినాదం ఎన్నికల్లో పని చేయలేదని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మాదిరిగానే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. ఆకాశంలోని గంగను భగీరతుడు భూమి మీదికి దింపితే తమ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి వృధా నీటిని రైతులకు అందించడానికి కంకణం కట్టుకుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి కె. రోశయ్య పొగిడారు. తెలంగాణ విషయంలో సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. తెలంగాణకు ఏ విధమైన గడువు లేదని ఆయన చెప్పారు.