ఇది తెలంగాణ దుర్దినం: తెలంగాణ సంఘాలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ పునరంకిత సభ రోజును తెలంగాణకు చెందిన దాదాపు 24 సంఘాలు, సంస్థలు తెలంగాణ దుర్దినంగా పాటించాయి. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు సహకారంతో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టిడియఫ్) ఇండియా కమిటీ ఆ సంఘాలతో శనివారం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వైయస్ పాలనను వ్యతిరేకిస్తూ 14వ తేదీని తెలంగాణ దుర్దినంగా పాటించాలని నిర్ణయించాయి. తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ జర్నిస్టుల ఫోరం, హైదరాబాద్ బచావో, తెలంగాణ జాగరణ సమితి, తదితర సంఘాలు 14వ తేదీని తెలంగాణ దుర్దినంగా పాటించాయి.
గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి తెలంగాణకు అన్యాయం చేశారని ఆ సంఘాలు విమర్శించాయి. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తూ నదీజలాలను కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం - ఇండియా కమిటీ చైర్మన్ బి.వి. రావు, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు కన్వీనర్ తెలంగాణ ప్రభాకర్ విమర్శించారు. 610 జీవోను అమలు చేసి ఉద్యోగాల్ల తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి దాన్ని అమలు చేయడం లేదని, పైగా మంత్రివర్గ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 100 మంది తెలంగాణేతర శాసనసభ్యులు సంతకాలు సేకరిస్తే మౌనంగా ఉండిపోయారని వారు విమర్శించారు. అభివృద్ధి పేర, పరిశ్రమల స్థాపన పేర హైదరాబాద్ భూములను ఇతర ప్రాంతాలవారికి కట్టబెట్టడాన్ని వారు వ్యతిరేకించారు.