మావోయిస్టుల ఘాతుకం: 12 మంది తెలుగువారి బలి
ముంబాయి: మావోయిస్టుల ఘాతుకానికి మహారాష్ట్రలోని 12 మంది తెలుగువారు బలయ్యారు. పలువురు గాయపడ్డారు. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనాలపై మావోయిస్టులు మంగళవారం తెల్లవారుజామున బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో 12 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈదాడి ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి మండలంలోని మూల్చేర్ గ్రామం సమీపంలో జరిగింది. ఈ దుర్ఘటన దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగింది. దీంతో వివరాలు చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
మహారాష్ట్రంలోని తెలుగువారు ఛత్తీస్ఘడ్లోని కాంకేడు జిల్లా పకంజూర్ వద్ద ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లి బృందం వాహనాలను మావోయిస్టులు బాంబులతో పేల్చివేశారు. పెళ్లి బృందానికి చెందిన మూడు జీపులను, మారుతి కారును మావోయిస్టులు పేల్చివేశారు. ఈ సంఘటనను ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి కె. జానారెడ్డి హైదరాబాద్లో ఖండించారు. ఇది మావోయిస్టుల ఘాతుకమని ఆయన మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంఘటన నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులను అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు.