ఒబిసి కోటాపై వెనక్కి తగ్గం: అర్జున్ సింగ్
న్యూఢిల్లీ: ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనపై వెనక్కి తగ్గేది లేదని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అర్జున్ సింగ్ మంగళవారం లోక్సభలో ప్రకటించారు. ఉన్నత విద్యాసంస్థల్లో సీట్ల సంఖ్యను పెంచాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన చెప్పారు. ఉన్నత విద్యా సంస్థల్లో ఒబిసి కోటాను కల్పించేందుకు రాజ్యాంగ సవరణను అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
ప్రైవేట్, అన్ ఎయిడెడ్ సంస్థల్లో ఎస్సి, ఎస్టిలకు, ఒబిసిలకు రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగంలోని 93వ సవరణను తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. అందుకు యుపిఎ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ఒబిసి కోటాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టినవారిపై పోలీసుల చర్యను తాను సమర్థించబోనని, శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ఆయన అన్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో రెండో మాట లేదని, అయితే ఏ విధంగా అమలు చేయాలనేదే తమ ముందున్న సమస్య అని ఆయన అన్నారు.