కోనేరుది క్రమశిక్షణారాహిత్య కాదా?: ఉప్పునూతల
హైదరాబాద్: మున్సిపల్ శాఖా మంత్రి కోనేరు రంగారావు తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని అనడం క్రమశిక్షణా రాహిత్యం కాదా? అని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ సమస్యలపై మాట్లాడినందుకు కాంగ్రెస్ శాసనసభ్యులు మర్రి శశిధర్ రెడ్డి, పి. జనార్దన్ రెడ్డి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారని అన్నప్పుడు కోనేరు రంగారావు ప్రకటన కూడా క్రమాశిక్షణారాహిత్యమే అవుతుందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణ ప్రజలు సమైకాంధ్రనే కోరుకుంటున్నారనే కోనేరు రంగారావు మాటల్లో నిజం లేదని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణపై కోనేరు రంగారావు చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని కోనేరు రంగారావుకు ఎలా తెలిసిందని ఆయన అడిగారు. ఏదైనా నియోజకవర్గంలో ఎవరైనా రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణ ఎజెండాపై పోటీ చేసేవారిపై సమైక్యాంధ్ర నినాదంతో పోటీ చేయాలని, సమైక్యాంధ్ర నినాదంతో పోటీ చేసినవారు గెలిస్తే తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణను కోరుకోవడం లేదని అర్థమవుతుందని ఆయన అన్నారు. అలా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు తాను రాజీనామా చేయడానికి సిద్ధమేనని ఆయన అన్నారు.