ముంబాయిలో అలూకాస్ దొంగల పట్టివేత
హైదరాబాద్: హైదరాబాద్లోని పంజగుట్టలో గల అలూకాస్ నగల దుకాణంలో దోపిడీకి పాల్పడినవారు నాటకీయంగా ముంబాయి పోలీసులకు చిక్కారు. దోపిడీకి పాల్పడిన వినోద్ రాంబోలీ, అజయ్ సింగ్లు పోలీసుల చేతికి చిక్కారు. శ్రీకాంత్ అనే మరో దొంగ పరారీలో ఉన్నాడు. వినోద్ రాంబోలీపై ముంబాయి పోలీసులు నగర బహిష్కారం విధించారు. అలూకాస్ దోపిడీ దొంగలను పట్టిచ్చిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల బహుమతిని ముంబాయి, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు పంచుతున్నట్లు రాష్ట్ర హోంమంత్రి కె. జానారెడ్డి చెప్పారు.
పట్టుబడినవారి నుంచి పోలీసులు 50 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అలూకాస్ నగల దుకాణంలో చోరీ సొత్తు మొత్తం స్వాధీనం అయ్యే అవకాశాలున్నాయని మంత్రి చెప్పారు. ఇక తారా జ్యువెల్లరీ షాపులో జరిగిన దోపిడీపై దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన చెప్పారు. సంఘటనా స్థలంలో చిక్కిన గుజరాతీ పత్రికనే పోలీసులు దొంగలను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించింది.