బిల్లు పెడితే మద్దతిస్తాం: ధర్నాలో బిజెపి
హైదరాబాద్: పార్లమెంటులో మూడు రోజుల్లోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ప్రతిపాదించాలని, ఆ బిల్లుకు తాము మద్దతిస్తామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికార ప్రతినిధి ప్రకాశ్ జావ్దేకర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ బిజెపి గురువారం హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద ధర్నాకు దిగింది. తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఏమీ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. వామపక్షాలు, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించినా పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన అన్నారు.
తాము మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశామని, తిరిగి తాము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక (సియంపి)లో తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇచ్చారని, ఇప్పుడు తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ కోసం తాము ఏది చేయాల్సి వచ్చినా చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. మిగతా నాయకులను వెలుపలే ఉంచి తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఒక్కరే సోనియాను కలవడం మోసం చేయడానికేనని ఆయన వ్యాఖ్యానించారు.