ఇంజనీరింగ్లో బాలురు, మెడిసిన్లో బాలికలు
హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎమ్సెట్ పరీక్షా ఫలితాలు గురువారం ఉదయం విడుదలయ్యాయి. ఇంజనీరింగ్లో ప్రవేశం కోసం జరిగిన పరీక్షల్లో బాలురది పైచేయి కాగా, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశం కోసం జరిగిన పరీక్షలో బాలికలది పైచేయిగా నిలిచింది. ఇంజనీరింగ్ మొదటి రెండు ర్యాంక్లు సాధించిన ప్రతీక్ అగర్వాల్, శేషవపన్ ఇద్దరు హైదరాబాద్కు చెందినవారే. మెడిసిన్లో ఫస్టు ర్యాంక్ గుంటూరు వికాస్కు చెందని వరుణ్తేజకు లభించింది. ఫలితాలను ఉన్నత విద్యాశాఖ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు విడుదల చేశారు.
ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం జరిగిన ప్రవేశపరీక్షలకు 1,42,095 మంది అభ్యర్థులు హాజరు కాగా 1,05,825 మంది అర్హత సాధించారు. బాలురు 69.56 శాతం మంది అర్హత సాధించగా, బాలికలు 30.44 శాతం మంది అర్హత సాధించారు. మెడిసిన్లో ప్రవేశం కోసం జరిగిన పరీక్షకు మొత్తం 92,214 మంది హాజరు కాగా, 72,174 మంది అర్హత సాధించారు. బాలికలు 48,278 మంది హాజరు కాగా, 38,320 మంది అర్హత సాధించారు. ఇది 50.10 శాతం. బాలురు 43,936 మంది హాజరు కాగా 35,854 మంది అర్హత సాధించారు. ఇది 49.90 శాతం. పరీక్ష పత్రాల వాల్యుయేషన్లో ఏ విధమైన అవకతవకలు జరగలేదని ఉన్నత విద్యా శాఖ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఐఐటి అడ్మిషన్లు పూర్తయిన తర్వాతనే ఇంజనీరింగ్ అడ్మిషన్లు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.