తెలంగాణపై ఎటూ తేల్చని ప్రణబ్ కమిటీ
న్యూఢిల్లీ: తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమని అవసమరమని ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పాటైన యుపిఎ సబ్ కమిటీ సభ్యుడు రఘువంశ ప్రసాద్ సింగ్ అన్నారు. ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని సబ్ కమిటీ గురువారం సాయంత్రం రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో సమావేశమైంది. ఇదే ఆఖరి సమావేశం కాదని కూడా రఘువంశ ప్రసాద్ సింగ్ అన్నారు. మధ్యంతర నివేదిక ఇచ్చే ప్రసక్తి లేదని, మరిన్ని పార్టీలతో చర్చించాల్సిన అవసరం ఉందని ఉప సంఘం అభిప్రాయపడింది. బిజెపికి మరోసారి లేఖ రాసే ప్రసక్తి లేదని కూడా సంఘం అభిప్రాయపడింది.
గురువారం సాయంత్రం నాలుగు గంటలకు జరగాల్సిన సమావేశంలో కేంద్ర మంత్రి, సబ్ కమిటీ సభ్యుడు దయానిధి మారన్ అందుబాటులో లేకపోవడంతో సాయంత్రం ఐదు గంటలకు ఆయన వచ్చిన తర్వాత జరిగింది. కేవలం 20 నిమిషాల్లో సమావేశం ముగిసింది. తెలంగాణపై నివేదిక సమర్పించే విషయంలో తుది నిర్ణయం ప్రకటించవచ్చుననుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుల ఆశలపై సబ్ కమిటీ నీళ్లు చల్లింది. ఎటూ తేల్చకుండానే సమావేశం ముగిసింది.