వెస్టిండీస్పై తొలి వన్డేలో భారత్ విజయం
కింగ్స్టన్: లారా సేనపై ద్రావిడ్ యువసేన తొలి క్రికెట్ వన్డే మ్యాచ్లో విజయం సాధించింది. తన వన్డే కెరీర్లో 12వ సెంచరీ పూర్తి చేసిన కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ భారత్కు విజయాన్ని అందించాడు. ద్రావిడ్కు వెస్టిండీస్పై ఇది మూడో సెంచరీ. వరుస వైఫల్యాలలో కొట్టుమిట్టాడుతున్న మహ్మద్ కైఫ్ వెస్టిండీస్ పర్యటన ఆశావహంగా ప్రారంభమైంది. కైఫ్ 66 పరుగులు సాధించి భారత్ విజయంలో పాలు పంచుకున్నాడు. వెస్టిండీస్పై జమైకాలోని సబీనా పార్కులో జరిగిన తొలి వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ద్రావిడ్ 102 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్స్లతో 105 పరుగులు చేశాడు. ద్రావిడ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
వర్షం కారణంగా వాతావరణం సరిగా లేకపోవడంతో ఇన్నింగ్స్ను 45 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 45 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. గెయిల్ సెంచరీ సాధించాడు. గెయిల్ 18 ఫోర్లు, రెండు సిక్స్లతో 123 పరుగులు చేశాడు. కెప్టెన్ లారా 35 పరుగులు చేశాడు. భారత బౌలర్లు అగార్కర్కు రెండు, పఠాన్కు ఒక్కటి, మునాఫ్పటేల్కు 1 వికెట్లు లభించాయి. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్కు దిగిన భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. సెహ్వాగ్ 22 పరుగులు చేశాడు. ధోనీ 18, యువరాజ్ 12 పరుగులు చేశారు.