ప్రణబ్ కమిటీ ఒక డ్రామా కంపెనీ: ఇంద్రసేన్
హైదరాబాద్: తెలంగాణపై రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పాటయిన యుపిఎ సబ్ కమిటీ డ్రామా కంపెనీల తయారైందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు. 15 నిమిషాలు సమావేశమైతే అయిపోయినట్లేనా అని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఎటూ తేల్చదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు కె. చంద్రశేఖరరావు ఢిల్లీలో తెలంగాణ పరువు తీస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణకు ఎవరి హామీలతో డెడ్లైన్లు ఇస్తూ వస్తున్నారో స్పష్టం చేయాలని ఆయన చంద్రశేఖర రావును డిమాండ్ చేశారు. తెలంగాణ అంటే నవ్వులాటగా తయారయ్యే పరిస్థితిని ఢిల్లీలో తెరాస నాయకులు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ వాదం దెబ్బ తినడానికి తెరాస నాయకులే కారణమని ఆయన అన్నారు. ప్రణబ్ కమిటీ సమావేశమైతే తెలంగాణపై నిర్ణయం అయిపోయినట్లేనా? అని ఆయన అడిగారు.