వర్గీకరణపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు: మందకృష్ణ
న్యూఢిల్లీ: ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (యస్ ఆర్పియస్) నాయకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. వ్యక్తి లాభాల కోసం వెంటనే చట్టాలు తెచ్చే ప్రభుత్వం కోట్లాది మందికి ప్రయోజనం చేకూర్చే అంశాల విషయంలో ఎందుకు జాప్యం చేస్తుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. జోడు పదవుల కోసం వెంటనే చట్టం తెచ్చిన ప్రభుత్వం ఎంతో ప్రయోజనం కలిగించే ఎస్సి రిజర్వేషన్ల విషయంలో ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ఆయన అడిగారు. కాంగ్రెస్ మాలలు తప్ప మిగతా దళితులు అవసరం లేదా అని ఆయన అడిగారు. వర్గీకరణ జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో దేశానికంతటికీ ఒకే విధానాన్ని అనుసరించడం సాధ్యం కాకపోతే రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి కోనేరు రంగారావు కేంద్రానికి సూచించారు. తమిళనాడులో వర్గీకరణ అమలు అవుతోందని, ఆ పద్ధతిలో ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణను చేయడానికి రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం అవసరమని ఆయన అన్నారు.