రాష్ట్రంలో సదర్న్ స్ల్పెండర్ ఏర్పాటు: వైయస్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో సదర్న్ స్ల్పెండర్ ఏర్పాటుకు కేంద్ర పర్యాటక మంత్రి అంబికా సోనీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారంనాడు అంబికా సోనీని కలిసి రాష్ట్రంలోని వివిధ పర్యాటక స్థలాల అభివృద్ధికి సాయాన్ని కోరారు. అనంతరం ఆయన ఆ వివరాలను మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలు కలిసి అటువంటిదాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నాయని, అయితే కర్ణాటక సొంతంగా ప్యాలెస్ విల్లాను ఏర్పాటు చేసే పనిలో మునిగిపోయిందని, దీంతో మన రాష్ట్రంలో కూడా విడిగా సదర్న్ స్ల్పెండర్ ఏర్పాటు చేయాలని తలపెట్టామని ఆయన వివరించారు. హైదరాబాద్లోని చార్మినార్ ఆధునీకరణకు, నాగార్జునసాగర్ నుంచి అమరావతి వరకు బౌద్ధ ప్రదేశాల అభివృద్ధికి సాయం అందించాలని కూడా అంబికా సోనీని కోరినట్లు ఆయన తెలిపారు.
కొల్లేరు నిర్వాసితుల పునరావాసానికి ప్రత్యేక నిధి నుంచి 40 కోట్ల రూపాయలు వాడుకోవడానికి అనుమతించాలని కేంద్ర అటవీ శాఖ మంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. విశాఖ, తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో 10వేల హెక్టార్లలో గిరిజనులు కాఫీ సాగు చేసుకోవడానికి అనుమతించాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లను కోల్పోయే ప్రమాదం ఉందని, ఈ సీట్లను కోల్పోకుండా ఫ్యాకల్టీ, విద్యార్థుల నిష్పత్తిని తగ్గించాలని, రిటైర్డ్ డాక్టర్లను ప్రైవేట్ కాలేజీల్లో అధ్యాపకులుగా నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు.