విశాఖ ఉక్కుకు సెయిల్ చిక్కు: ప్రధానితో వైఎస్
విశాఖపట్నం: ఆంధ్రులు అనేక త్యాగాలు చేసి విశాఖ పట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటయ్యేలా చూసుకున్నారని, ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాంతంలోనే ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలని నిర్ణయించి, ఈ ప్రాంతానికి న్యాయం చేశారని ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విస్తరణ పథకాన్ని ప్రారంభించడానికి ప్రధాని ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గతంలో విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉన్నప్పుడు విలీనం చేసుకోవడానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) వెనుకాడిందని, ఇప్పుడు సంస్ధ లాభాల్లోకి వచ్చింది కాబట్టి విలీనం చేసుకోవడానికి సెయిల్ ప్రయత్నిస్తోందని, దీనిని ప్రధాని మన్మోహన్ సింగ్ అడ్డుకోవాలని కోరారు. సెయిల్ది దుర్మార్గపు ఆలోచన అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించగా స్ధానికులు హర్షధ్వానాలు చేశారు.