శ్రీనగర్లో ర్యాలీపై మిలిటెంట్ల దాడి: 8 మంది మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆదివారం నిర్వహించిన ర్యాలీపై దాడి చేశారు. ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కొద్దిసేపట్లో అక్కడికి వస్తారనగా ఈ దాడి జరిగింది. శ్రీనగర్లోని షేర్ - ఎ - కాశ్మీర్ వద్ద ఈ దాడి జరిగింది. ఈ దాడి సందర్భంగా ఒక మిలిటెంట్ సహా 8 మంది మృతి చెందారు. భారీ పేలుళ్లతో పాటు ఉధృతమైన కాల్పులు చప్పుడు కూడా వినిపించింది.
ఆదివారం ఒంటి గంటా 15 నిమిషాల ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. ఈ దాడిలో పలువురు తీవ్రవాదులు పాల్గొన్నట్లు భావిస్తున్నారు. ఈ సంఘటనతో శ్రీనగర్లో తీవ్రమైన భయాందోళనలు చోటు చేసుకున్నాయి. దాడి జరిగిన సమయంలో ఫెన్సింగ్ ఉన్న పార్కులో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పాటు మంత్రులు కూడా ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని లష్కర్ - ఎ - తోయిబా, అల్ మన్సూరియా ప్రకటించుకున్నాయి.