ఒక్క పరుగు తేడాతో వెస్టిండీస్ గెలుపు
కింగ్స్టన్: రెండో వన్డేలో తుది ఓవర్ మూడో బంతికి బ్రేవో యువరాజ్ వికెట్ను పడగొట్టడంతో వెస్టిండీస్ భారత్పై ఒక పరుగు తేడాతో అనూహ్య విజయాన్ని సాధించింది. తుది ఓవరులో భారత్ 11 పరుగులు చేయాల్సి వుండగా యువరాజ్ వరసగా రెండు ఫోర్లు కొట్టాడు. చివరి తర్వాతి మూడు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సి వుంది. ఆ సమయంలో బ్రేవో వేసిన ఫుల్ టాస్ బంతిని బలంగా కొట్టబోయే యువరాజ్ వికెట్లను కోల్పోయాడు. ఈ పరాజయంతో భారత్ 17 వరుస విజయాలకు బ్రేక్ పడింది. దీంతో వెస్టిండీస్, భారత్ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సరీస్ 1-1 తేడాతో సమమైంది.
తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ వరుసగా స్వల్ప స్కోరుకే నాలుగు వికెట్లు కోల్పోయిన సమయంలో సంయమనంతో బ్యాటింగ్ చేసి 98 పరుగులు సాధించిన రామ్నరేష్ శర్వాన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే భారత్ స్వల్ప స్కోర్ను ఛేదించే విషయంలో దెబ్బ తిని 197 పరుగులకు అలవుట్ అయింది. వెస్టిండీస్ బౌలర్ ఇయాన్ బ్రాడ్షా 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకొని వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ బ్యాట్స్మెన్ ఒకరొక్కరో పెవిలియన్ దారి పడుతున్న సమయంలో యువరాజ్ ఒంటరి పోరు సాగించాడు. సురేష్ రైనా 27 పరుగులు సాధించాడు. వెస్టిండీస్ పార్ట్టైమ్ బౌలరు సామ్యూల్స్ 30 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. భారత బౌలర్లు ప్రదర్శించిన అద్భుతమైన బౌలింగ్ను భారత బ్యాట్స్మెన్ వాడుకోలేకపోయారు.