పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వీప్: వైయస్
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో మాదిరిగా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన రాబోయే పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలున్నప్పటికీ అతి ధీమా కూడదని ఆయన మంత్రులకు సూచించారు.
పంచాయతీ ఎన్నికల్లో మంత్రులు, పార్టీ శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో మినహా మరే జిల్లాలోనూ తెలుగుదేశంపార్టీకి వచ్చే జడ్పిటిసిల సంఖ్య రెండంకెలు దాటదని ఆయన అన్నారు. కొత్త రేషన్ కార్డులపై జూన్ 1వ తేదీ నుంచి బియ్యం అందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే మంత్రివర్గ సమావేశం గురించి తెలియజేయడానికి వివరాలు ఏమీ లేవంటూ ప్రభుత్వం మీడియా సమావేశంలో మాట్లాడడానికి నిరాకరించింది.