పోలీసు కమీషనర్ ఆఫీసు వద్ద ధర్నా, ఉద్రిక్తత
హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసుల తీరుతో హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఆదివారంనాడు రోడ్డు ప్రమాదం జరిగి షరీఫ్ అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన తీవ్ర పరిణామాలకు దారి తీసింది. ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి మోసిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారంనాడు మరణించాడు. షరీఫ్ మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్ పాతబస్తీలో ధర్నాకు దిగారు. ఆందోళనకారులు రాళ్లు రువ్విన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. షరీఫ్ అంత్యక్రియల ర్యాలీ హైదరాబాద్లోని పాతబస్తీలో గల అలియాబాద్లో ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకారులు బస్సులపైకి, పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇళ్లలోకి చొరబడి పోలీసులు ఆందోళనకారులను చితకబాదారు. ఈ లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారు. తప్పు చేసిన పోలీసులను శిక్షిస్తామని పోలీసు కమీషనర్ మహంతి చెప్పారు.
ట్రాఫిక్ పోలీసుల వైఖరితో ఇద్దరి ప్రాణాలు పోయిన సంఘటనకు నిరసనగా మజ్లీస్ కార్యకర్తలు హైదరాబాద్ నగర పోలీసుల కమీషనర్ మహంతి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కమీషనర్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో కమీషనర్ కార్యాలయం గేట్లు మూసివేసి అదనపు బలగాలను మోహరించారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలేసి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మజ్లీస్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ, శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా పాల్గొన్నారు. ఈ సమయంలో కమీషనర్ మహంతికి, అక్బరుద్దీన్ ఓవైసీకి మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఇద్దరి మృతికి కారణమైన ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ను అరెస్టు చేయాలని అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. సంఘటనపై విచారణ జరిపిన తర్వాతనే అరెస్టుపై నిర్ణయం తీసుకుంటామని కమీషనర్ చెప్పారు. కమీషనర్ పదవి నుంచి మహంతిని తప్పించాలని అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.