బోగస్ గుట్టు తేల్చాకే ఎన్నికలు: బాబు డిమాండ్
గుంటూరు: బోగస్ ఓటర్ల నిగ్గు తేల్చే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో విపరీతంగా బోగస్ ఓట్లు నమోదయ్యాయని ఆయన విమర్శించారు. గుంటూరు జిల్లా సొలాస గ్రామం సమీపంలోని బోయపాలెం వద్ద ఆయన బుధవారంనాడు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తమ పార్టీకి చెందినవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు కారణమైన జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేయాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మార్వోలను, సంబంధిత అధికారులను సస్పెండ్ చేయడం అవసరమని ఆయన అన్నారు.
తప్పులు చేసే అధికారుల గుండెల్లో నిద్రపోతానని ఆయన హెచ్చరించారు. అధికారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే సహించబోమని ఆయన అన్నారు. అధికారులపై ఆయన నిప్పులు చెరిగారు. తప్పులు చేసే అధికారులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ఆయన చెప్పారు. తమపై జరుగుతున్న వేధింపు చర్యలను పార్టీ కార్యకర్తలు చంద్రబాబునాయుడుకు చెప్పుకున్నారు. దీనికి ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. కార్యకర్తల ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డుపెడతానని ఆయన చెప్పారు. తమపై పెడుతున్న తప్పుడు కేసులకు భయపడేది లేదని ఆయన అన్నారు.