ఐశ్వర్యరాయ్ క్షేమం: ప్రచారం అబద్ధం
ముంబాయి: బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ జర్మనీలో కారు ప్రమాదానికి గురైందని, తలకు బలంగా గాయాలు కావడంతో మరణించిందని గురువారం ఉదయం పెద్ద యెత్తున ఊహాగానాలు చెలరేగాయి. ఈ ఊహాగానాలతో మీడియా ప్రతినిధులు, అభిమానులు ఉరుకులు పరుగులు పెట్టారు. అయితే ఐశ్వర్యారాయ్ హాయిగా ఉంది. తప్పుడు ప్రచారాలు ఎవరు చేస్తున్నారో తనకు తెలియదని ఐశ్వర్యారాయ్ బిజినెస్ మేనేజర్ హరిసింగ్ అన్నారు.
తనకు జాతీయ, అంతర్జాతీయ మీడియా నుంచి లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయని, ఐశ్వర్యారాయ్ క్షేమంగానే ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఐశ్వర్యారాయ్ చెన్నైలో మణిరత్నం సినిమా గురు షూటింగ్లో పాల్గొంటున్నారని ఆయన చెప్పారు. కేన్స్ చలనచిత్రోత్సవంలో పాల్గొని ఆమె ఈ నెల 21వ తేదీన తన తల్లి జన్మదిన వేడుకలో పాల్గొనడానికి ముంబాయికి తిరిగి వచ్చింది. అనంతరం చెన్నైకి వెళ్లింది. నెల పాటు ఆమె అక్కడ షూటింగ్లో పాల్గొంటుంది.