తెలంగాణపై కుంటిసాకులు వద్దు: ఉప్పునూతల
హైదరాబాద్: కుంటిసాకులు చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని పక్కదారి పట్టించవద్దని సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు కె. కేశవరావుకు సూచించారు. వామపక్షాలు వ్యతిరేకంగా ఉన్నందున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదని కేశవరావు అనడాన్ని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యతిరేకించారు. తెలంగాణలో ఎవరికీ రాష్ట్ర ఏర్పాటుపై ఆతురత లేదని కేశవరావు అనడాన్ని కూడా ఆయన ఖండించారు.
వచ్చే పంచాయతీ ఎన్నికల్లో దిగువస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆసక్తి లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు చర్యలు తీసుకోకుండా వామపక్షాలు వ్యతిరేకంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి అడ్డుపడుతున్నారని అనడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు వామపక్షాలు విముఖత చూపుతున్నాయనేది సరైన కారణం కాదని ఆయన అన్నారు. మెజారిటీ కావాలంటే బిజెపి మద్దతు ఇస్తానని ప్రకటించిందని, అందువల్ల వామపక్షాల వల్ల రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదనేది సమంజసమైన కారణం కాదని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని మెరిట్ను బట్టి ఆలోచించాలని ఆయన అభిప్రాయపడ్డారు.