వైెయస్కు ప్రజలే బుద్ధి చెప్తారు: బాబు
రాజమండ్రి: వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్తారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదివారం పార్టీ మహానాడులో అన్నారు. గత రెండేళ్లలో వై.యస్. ప్రభుత్వం ఏం సాధించిందని ప్రజలు కాంగ్రెస్కు ఓట్లేస్తారని ఆయన అడిగారు. తాము ఆత్మ విమర్శ చేసుకున్నామని, ఇక ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద యెత్తున ఉద్యమాలు చేపడుతామని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హత్యా రాజకీయాలు అపకపోతే మరో కురుక్షేత్రం తప్పదని మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్.టి. రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ కాంగ్రెస్ను హెచ్చరించారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబుతో కలిసి ముందుకు తీసుకెళ్తానని ఆయన చెప్పారు. ఎన్.టి.రామారావు జయంతి సందర్భంగా ఆయనకు ఆదివారం మహానాడులో నివాళులు అర్పించారు. ఎన్.టి. రామారావు జయంతి సందర్భంగా మహానాడు వద్ద రక్తశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. ఎన్.టి. రామారావు పేర ఒక బ్లడ్ బ్యాంక్ను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది.