నేనూ తెలంగాణ పోరాటం చేశా: ఉమాభారతి
మెదక్: తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన్నానని భారతీయ జనశక్తి నేత ఉమాభారతి ప్రకటించారు. ఆమె ఆదివారంనాడు మెదక్ జిల్లాలో పర్యటించారు. రుద్రారంలోని ఆల్ కబీర్ను మూసేయాలని డిమాండ్ చేస్తూ ఆమె రోడ్డుపై బైఠాయించారు. తన దృష్టిలో తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో ఏర్పడిందని, అందుకే తమ పార్టీకి ఇద్దరు కన్వీనర్లను నియమిస్తున్నామని ఆమె చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పోరాడే ఏ పార్టీకైనా తన మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు.
తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని, అందుకే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ కోసం పోరాటం జరుగుతోందని ఆమె అన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలో హింస పెరిగిందని ఆమె అభిప్రాయపడ్డారు. యుపిఎ ప్రభుత్వంలో ప్రధానిని నిస్సహాయుడిని చేశారని ఆమె విమర్శించారు. జోడు పదవుల్లో ఉండకూడదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకే తెలియదని ఆమె వ్యాఖ్యానించారు.