ముఖ్యమంత్రే అవినీతికి పాల్పడుతున్నారు: బాబు
రాజమండ్రి: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి స్వయంగా అవినీతికి పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. రాజమండ్రిలో జరుగతున్న పార్టీ మహానాడులో ఆయన సోమవారంనాడు మాట్లాడారు. ఇందిరమ్మ పథకంలో అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని ఆయన ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. ప్రాంతీయ విద్వేషాలకు తావు లేని జలవిధానాన్ని రూపొందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గోదావరి, కృష్ణా నదులపై ఇతర రాష్ట్రాలు అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెడితే మద్దతిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని కాంగ్రెస్ పార్టీయే భూస్థాపితం చేస్తుందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల స్థాయికి దిగజారిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. కేంద్రంలో ఏక పార్టీ పాలనకు కాలం చెల్లిందని, ఈ స్థితిలో కేంద్రంలో కీలక పాత్ర పోషించేందుకు పార్టీ సిద్ధం కావాలని ఆయన అన్నారు.