ఒబిసి కోటాపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ఒబిసి కోటాపై సుప్రీంకోర్టు సోమవారంనాడు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఒబిసిలకు 27.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ ప్రభుత్వ ఉత్తర్వు అమలుపై స్టే ఇవ్వాలనే పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కొన్ని విషయాలపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ అడుగుతూ జస్టిస్ అరిజిత్ పసాయత్, జస్టిస్ లోకేశ్వర్ సింగ్ పంటాలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ నోటీసులు జారీ చేసింది.
అంశం కోర్టు పరిధిలోకి వచ్చినందున సమాజం ప్రయోజనం దృష్ట్యా, ముఖ్యంగా రోగుల ప్రయోజనాల దృష్ట్యా సమ్మెను ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు విద్యార్థులకు సూచించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులను అడిషనల్ సాలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం ఆమోదించారు. సుప్రీంకోర్టు ఆదేశాల దృష్ట్యా విద్యార్థులు సమ్మెను విరమించుకోవాలని ఆయన కోరారు. నోటీసులకు సమాధానం ఇవ్వడానికి కేంద్రానికి సుప్రీంకోర్టు 8 వారాల గడువు ఇచ్చింది.