పౌర సరఫరాల మేనేజర్ ఇళ్లపై ఎసిబి దాడులు
ఒంగోలు: ప్రకాశం జిల్లా పౌర సరఫరాల కార్పోరేషన్ మేనేజర్ రెడ్డివారి సూర్యనారాయణ రెడ్డి ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ ( ఎసిబి) అధికారులు ఏక కాలంలో దాడి చేశారు. ఒంగోలు, హైదరాబాద్, బెంగుళూర్లలోని ఆయన ఇళ్లపై ఎసిబి అధికారులు దాడులు సోమవారం ఏక కాలంలో చేసి పెద్ద మొత్తంలో ఆస్తులు, కీలక పత్రాలు కనుగొన్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నానే ఆరోపణపై సూర్యనారాయణ రెడ్డిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. సూర్యనారాయణ రెడ్డికి కోటి రూపాయలకు మించి ఆస్తులుంటాయని ఎసిబి అధికారులు అంచనా వేస్తున్నారు.
బెంగుళూర్లో ఆయనకు ఓ ఇళ్లు ఉన్నట్లు ఎసిబి అధికారులు కనిపెట్టారు. హైదరాబాద్లోని ఫతేనగర్లో ఉన్న సూర్యనారాయణరెడ్డి ఇంటిలో సోదాలు నిర్వహించగా 20 లక్షల రూపాయల విలువ చేసే స్థలం ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకు ఎసిబి అధికారులు 50 లక్షల రూపాయల విలువ చేసే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లాకర్లను తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.