వైయస్ రౌడీయిజం మితిమీరుతోంది: బాబు
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి రౌడీయిజం రోజు రోజుకూ మితిమీరిపోతున్నదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఒక సీటు కూడా రాదని వ్యాఖ్యానించడం ముఖ్యమంత్రి రౌడీయిజానికి పరాకాష్ట అని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అక్రమాలు ఆపకపోతే కాంగ్రెస్ పతనం స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.
వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను అమ్ముతూ కాంగ్రెస్ వారు వేలాది కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారని ఆయన ఆరోపించారు. భూముల విక్రయాలపై న్యాయవిచారణ జరిపిస్తే నిజానిజాలు బయటపడతాయని ఆయన అన్నారు. కాంగ్రెస్వారు ఓటర్ల జాబితాను మార్చేస్తున్నారని, ప్రభుత్వ అక్రమాలపై తాము పోరాడుతామని ఆయన చెప్పారు. రాష్ట్రాన్నంతటినీ పులివెందుల మాదిరిగా చేయాలనే రాజశేఖర రెడ్డి ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బిజెపి, తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నాయని ఆయన విమర్శించారు.